Thursday, September 4, 2014

బాహ్య స్వరూపము – అంతర్ ప్రవృత్తులు

కర్మ అనేది మన చేతల (actions) మీద కంటే మనస్సు మీదే ఎక్కువ ఆధారపడి ఉంటుంది. బయట కనిపిస్తున్నదానికంటే మనస్సులో ఏమి జరుగుతున్నది అనేదాని మీదే బాహ్య ఫలితాలు ఆధారపడి ఉంటాయి. అంతఃకరణ ఈ కర్మ (పని) ఏ ఆలోచనతో, ఏ కోరికతో, ఏ పరిస్థితులలో ఎందుకు చేసాను అని ఆలోచించును. మనలోని గుప్తమనస్సు రహస్య గూఢచారివలె ప్రతిక్షణము వెంటఉండి మంచిచెడు పనులను యధాతధముగా రహస్య డైరీలో (చిత్రగుప్తడు) పొందుపరుచును. దీని ఆధారముగానే పాపపుణ్యములు కొలవబడతాయి.
 
ఉదాహరణకు ఒకే నేరము చేసిన వారికి కోర్టు వేరువేరు శిక్షలను విధిస్తుంది. ఎలాగంటే ముగ్గురు హత్య చేసిన వ్యక్తులను పట్టుకొనగా ఒకనిని కోర్టు విడిచిపెట్టగా, ఒకనికి ఐదు సంవత్సరముల శిక్ష, మూడవ వానికి యావజ్జీవశిక్ష విధించినది.
 
ఇందులో విడిచిపెట్టబడినవాడు ఇళ్ళుకట్టే కూలివాడు. ఇంటి పైకప్పుపై పనిచేస్తున్నప్పుడు అకస్మాత్తుగా రాయిజారి క్రింద వెళ్తున్నవానిపై పడగా అతని తలకు దెబ్బ తగిలి మరణించెను. ఇక్కడ మరణం సంభవించినది కానీ అది తెలిసి చెడు ఆలోచనలతో చేసినది కాదు. అందువలన ఇక్కడ కూలివాడు నిర్ధోషిలా విడిచిపెట్టబడ్డాడు. రెండవ అపరాధి రైతు. అతని పంట దొంగతనము చేస్తున్నవానిపై దాడిచేయగా అతను మరణించెను. కోపము రావడము మనిషి స్వభావము కానీ మరణించునట్లు కొట్టడము తప్పు. చేసిన అపరాధానికి పశ్చాతాపము పడుతూ, ప్రాయశ్చిత్తము చేసుకొనడానికి సిద్ధం అయ్యాడు. అందుచేత అతనికి ఐదు సంవత్సరముల జైలు శిక్ష విధించబడినది. మూడవ అపరాధి దొంగ. అతను ఒక ధనవంతుని హత్యచేసి ధనమును అపహరించెను. అతని అపరాధము నీచమైనది, తెలిసి చేసినది. కాబట్టి ఇతనికి కోర్టు యావజ్జీవశిక్ష విధించినది.
 
ఈ ముగ్గురు అపరాధులే, వారి నేరము యొక్క బాహ్యరూపము సమానము. కానీ శిక్ష బాహ్యస్వరూపమును బట్టి కాక లోపలి ప్రవృత్తులను అనుసరించి లభించింది. బాహ్యముగా (physical) చూస్తే కోర్టు శిక్ష విధించినది అని అనిపిస్తుంది. కానీ శిక్ష లభించినది మాత్రము వారి పాపపుణ్యములను అనుసరించి మాత్రమే. 
 
మానవ జీవితములోని విశేషమేమిటంటే ప్రతివ్యక్తి కొరకు వేరువేరు చట్ట వ్యవస్థ ఉంటుంది. లంచం విషయములో ఒక నౌకరు, ఒక క్లర్కు, ఒక మేజిస్ట్రేట్ ను పట్టుకుంటే వీరి ముగ్గురికి వేరువేరు శిక్షలు లభిస్తాయి. బహుశ నౌకరును మాటలతో దండించి పంపివేస్తే, మేజిస్ట్రేట్ ను డిస్మిస్ చేస్తారు. ఎందుకంటే అతను అందరికంటే ఎక్కువ బాధ్యత కలిగిన ఉద్యోగి.
 
చిన్న పెద్ద స్థితులలో (positions) ఉన్న ఉద్యోగుల యొక్క ఆచరణ (లంచం తీసుకోవడం) ఒకే విధముగా ఉన్నా మానసిక స్థితిని అనుసరించి చెడును లెక్కించుటలో ఎక్కువ తక్కువలు ఉంటాయి. జ్ఞానముతోపాటు మంచిని చెడును అర్ధం చేసుకునే వివేకము, యోగ్యత పెరుగుతాయి. తెలిసి చేసినా తెలియకచేసినా తప్పు తప్పే కానీ తెలిసి చేసిన తప్పుకి ఫలితము (దండన) ఎక్కువగా ఉంటుంది. అజ్ఞాని తప్పు చేసినా ఎటువంటి ప్రభావము ఉండదు. కానీ కర్తవ్యమును విడిచినవారు మాత్రము శిక్షార్హులు అవుతారు.        

No comments:

Post a Comment