Friday, September 16, 2016

మహాలయపక్షం


భాద్రపదమాసంలోని శుక్లపక్షం దేవతాపూజలకు ఎంత విశిష్టమైనదో, బహుళపక్షం పితృదేవతాపూజలకు అంత శ్రేష్ఠమైనది. పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం గనుక దీనికి పితృపక్షమని, మహాలయ పక్షమని పేరు. భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు పితృప్రాణం భూమిపై వ్యాపించి ఉంటుంది. పితరులను ఉద్దేశించి, వారి ఆత్మను తృప్తి పరచటానికి శ్రద్దతో అర్పించేదే శ్రాద్ధం. ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళాక దాని సూక్ష్మాతి సూక్ష్మ అంశం అటూఇటూ తిరుగుతూ ఉంటుంది. వారివారి కర్మానుసారం ఫలితం లభిస్తుంది. శ్రాద్ధకాలం ప్రారంభం కాగానే పితృదేవతలు తమతమ వారిని స్మరించుకుంటూ మనోమయరూపంలో శ్రాద్ధస్థలం చేరుకుంటారు. వారు బ్రాహ్మణులతో కూడి వాయురూపంలో భోజనం స్వీకరిస్తారు. సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించగానే పితరులు తమ పుత్ర, పౌత్రుల దగ్గరకు వస్తారని చెప్పబడింది. మహాలయ అమావాస్య నాడు వారు తమ సంతతి యొక్క గృహ ద్వారం దగ్గరే నిలబడతారు. నిజానికి, ప్రతిమాసంలోను అమావాస్య పితరుల పుణ్యతిథిగా భావించబడినా, మహాలయ అమావాస్యకు విశేష ప్రాముఖ్యత ఉన్నది. ఈ రోజు సమస్త పితృదేవతా విసర్జనం జరుగుతుంది. తమ పితరుల పుణ్య తిథి వివరాలు తెలియనివారు, పితృపక్షంలో ఆ తిథినాడు ఏ కారణం చేతైనా శ్రాద్ధం పెట్టలేనివారు మహాలయ అమావాస్య నాడు శ్రాద్ధం, దానం, తర్పణం చేస్తారు. అన్ని దానాలలోను అన్నదానం ప్రధానమైనది, అన్నదానం ఎప్పుడు చేసినా మంచి ఫలితాన్నే ఇస్తుంది, కానీ   మహాలయపక్షంలో చేసే అన్నదానం వలన అనంతకోటి యజ్ఞాల ఫలితం ప్రాప్తిస్తుంది. అలాగే మఖ నక్షత్రం పితరులకు సంబందించింది కనుక ఆ రోజు చేసిన శ్రాద్ధకర్మ అక్షయఫలన్నిస్తుంది. 

ఏ రోజు శ్రాద్ధకర్మ చేస్తే ఎటువంటి ఫలితం లబిస్తుందని వివిధ పురాణాల ఆధారంగా తెలుసుకోవచ్చు. పాడ్యమి నాడు శ్రాద్ధకర్మ చేయటం వల్ల ధన సంపద లభిస్తుంది. ద్వితీయనాడు శ్రాద్ధకర్మ చేయటం వల్ల రాజయోగం, సంపద లభిస్తుంది. తృతీయనాడు శ్రాద్ధకర్మ చేయటం వల్ల శత్రువులు నశిస్తారు. చతుర్దినాడు శ్రాద్ధకర్మ చేయటం వల్ల ధర్మగుణం, ఇష్టకామ్య ప్రాప్తి కలుగుతుంది, అంతే కాకుండా శత్రువుల వ్యూహాలు ముందుగా పసిగట్టగలరు. పంచమినాడు శ్రాద్ధకర్మ చేయటం వాళ్ళ ఉత్తమ లక్ష్మీప్రాప్తి కలుగుతుంది. పుత్రకామన గలవారికి ఫలం లభిస్తుంది. షష్ఠినాడు శ్రాద్ధకర్మ వల్ల దేవతలు, పితరులు ప్రసన్నులవుతారు. ఆ వ్యక్తికి సమాజంలో శ్రేష్ఠగౌరవం లభిస్తుంది. సప్తమినాడు శ్రాద్ధకర్మ వల్ల యజ్ఞం చేసిన పుణ్య ఫలం లభిస్తుంది. అష్టమినాడు శ్రాద్ధకర్మ చేస్తే సంపూర్ణ సమృద్ధి, ధనం, బుద్ది ప్రాప్తిస్తాయి. నవమినాడు శ్రాద్ధకర్మ చేస్తే విస్తారంగా సంపద, అనుకూలవతి అయిన భార్య లభిస్తుంది. దశమినాడు శ్రాద్ధకర్మ చేస్తే లక్ష్మీ ప్రాప్తి, పశుసంపద వృద్ది చెందుతుంది. ఏకాదశినాడు శ్రాద్ధకర్మ చేస్తే సర్వశ్రేష్ఠ దానఫలం లభిస్తుంది. అన్ని పాపాలు నశిస్తాయి, వేదజ్ఞానం ప్రాప్తిస్తుంది , కుటుంబం వృద్ది చెందుతుంది. ద్వాదశినాడు శ్రాద్ధకర్మ చేస్తే దేశం అబివృద్ది చెందుతుంది. శ్రాద్ధకర్తకు అన్నానికి లోటుండదు, అలాగే పుత్ర, పశు, మేధా, బుద్ధి, జయ సంపత్తి కలుగుతుంది. త్రయోదశినాడు శ్రాద్ద కర్మ చేస్తే ధనం, సంతతి, ఐశ్వర్యం, దీర్ఘాయువు, ఆరోగ్యం , బంధుమిత్రులలో గౌరవం లభిస్తాయి. చతుర్దశినాడు శ్రాద్ధకర్మ చేస్తే ఆయుధాల నుండి రక్షణ లభిస్తుంది. అమావాస్య నాడు శ్రాద్ధకర్మ చేసే వ్యక్తికి సమస్త లాభాలు కలిగి, అన్ని కోరికలు నెరవేరుతాయి.  

ఆర్థికాభావం వలన విద్యుక్తంగా శ్రాద్ధకర్మలు చేయలేకపొతే , పితృపక్షంలో కేవలం శాకంతో శ్రాద్ధం చేయవచ్చు. అది కూడా వీలుకాకపొతే గోవుకు గ్రాసం పెట్టవచ్చు, అదీ చేయలేని వారు ఒక నిర్జన ప్రదేశంలో నిల్చొని అపరాన్న సమయంలో రెండు చేతులు ఆకాశంవైపు ఎత్తి పితృదేవతలకు నమస్కరించవచ్చు. శ్రాద్ధకర్మ చేత పితృ దేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖసంతోషాలు, పరలోకంలో ఉత్తమగతులు లభిస్తాయని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది.

దానశీలిగా పేరుపొందిన కర్ణుడికి మరణానంతరం స్వర్గం ప్రాప్తించింది. ఆయన స్వర్గలోకానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఆకలి, దప్పిక కలిగాయి. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది. పండు కోసుకుని తిందామనుకుంటే ఆ పండు కాస్తా బంగారపు పండుగా మారిపోయింది. చెట్టుకున్న పండ్లే కాదు ఏ చెట్టు పండు కోయబోయినా అదే అనుభవం ఎదురైంది. కనీసం దప్పికయినా తీర్చుకుందామనుకుని దోసిట్లోకి నీటిని తీసుకోగానే ఆ నీరు కాస్తా బంగారపునీరుగా మారిపోయింది. దాంతో కర్ణుడు తాను చేసిన తప్పిదమేమిటి, తనకిలా ఎందుకు జరుగుతున్నదని వాపోతుండగా ‘‘కర్ణా! నీవు దానశీలిగా పేరు పొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే ఆ దానాలన్నీ బంగారం, వెండి, డబ్బు రూపేణా చేశావు కానీ, కనీసం ఒక్కరికి కూడా అన్నంపెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకీ దుస్థితి ప్రాప్తించింది’’ అని చెప్పగా,  కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకెళ్ళి ప్రాధేయపడగా, ఆయన కోరిక మేరకు దేవరాజయిన ఇంద్రుడు కర్ణునికి ఒక అపురూపమైన అవకాశమిచ్చాడు. నీవు భూలోకానికెళ్ళి అక్కడ అన్నార్తులందరికీ అన్నంపెట్టి, మాతాపితరులకు తర్పణలు వదిలి తిరిగి రమ్మన్నాడు. ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమినాడు భూలోకానికి చేరాడు. అక్కడ పేదలు, బంధుమిత్రులు అందరికీ అన్నసంతర్పణ చేశాడు. పితరులకు తర్పణలు వదిలాడు. తిరిగి అమావాస్యనాడు స్వర్గానికెళ్ళాడు. ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు, పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది, ఆకలి తీరింది. కర్ణుడు భూలోకంలో గడిపి, తిరిగి స్వర్గానికెళ్ళిన ఈ పక్షం రోజులకే మహాలయపక్షమని పేరు. ఈ మహాలయ పక్షములో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు.

యజ్ఞయాగాదులు, తపోధ్యానాలతో దేవఋణాన్ని, తాతముత్తాలకు పిండప్రదానాలు చేసి పితృ ఋణాన్ని, వేదశాస్త్రాధ్యయన ప్రవచనాలతో ఋషి ఋణాన్ని తీర్చుకోవాలి అని మహాభారతంలో ఆయా సందర్భాలలో బోధించబడింది.

Tuesday, November 25, 2014

అన్నము

అన్నము మన ప్రాణాలను నిలబెట్టేది. అందుకే అన్నమును పరబ్రహ్మ స్వరూపము అన్నారు. బ్రహ్మ తత్వమును అన్నము రూపములో స్వీకరించడం ద్వారా బ్రహ్మతత్వాన్ని శరీరము గ్రహిస్తూ ఉంటుంది. భగవద్గీత, విష్ణుసహస్ర నామము ద్వారా కూడా మనకు తెలుస్తున్నది ఇదే. విష్ణువే ఆహారము, ఆ ఆహారమును భక్షించువాడు కూడా ఆయనే. 
 
పూర్వకాలములో అతిధికి భోజనం పెట్టకుండా గృహస్థులు తినేవారు కాదు. ప్రతి ఇల్లు నిత్య సమారాధనలాగా ఉండేవి. అన్నం వండేటప్పుడే ఒక గుప్పెడు ఎక్కువ వెయ్యండి అని చెప్పేవారు. ఇంటికి వచ్చినవారికి లేదనకుండా ఆహారం పెట్టేవారు. తమకు తినడానికి లేకపోయినా ఉన్నది అతిధికి పెట్టి తాము పస్తులు ఉండేవారు. రంతిదేవుడు, మహాభారతములోని బ్రాహ్మణుడు ముంగిస కధ, మొదలైనవి దీనికి ఉదాహరణలు. ఎదుటివారి ఆకలిని తీర్చమే నిజమైన యజ్ఞముగా భావించేవారు. నేడు కాలము, పరిస్థితులు  దాదాపుగా మారిపోయాయి. ఇంటికి ఎవరైనా వస్తే వారు ఎప్పుడు వెళతారా, ఎప్పుడు తిందామా అన్న ధోరణి తప్ప ఉన్నదానితోనే పంచుకుతినే పద్ధతే లేకుండా పోయింది. నూటికి 90% ఇళ్ళు ఇలాగే ఉన్నాయి. చివరికి తిన్నాక మిగిలినవి కూడా మరొకరికి ఇవ్వడానికి ఇష్టపడంలేదు. వాటిని చద్దిపెట్టెలలో (refrigerator) దాచుకుని మళ్ళీ మళ్ళీ తినడానికే ఇష్టపడుతున్నారు. న్ని దానములలోకెల్లా అన్నదానము గొప్పది అంటారు. దానికి కారణము ఏది ఇచ్చినా దానికన్నా మెరుగైనది కావాలని కోరుకుంటారు. చిన్న ఇల్లు ఉంటే పెద్దది కావాలని, పెద్దది ఉంటే ఇంకా పెద్దది కావాలని, ఒక ఇల్లు ఉంటే ఇంకొకటి కావాలని... ఇలా బండి ఉంటే కారు కావాలని, చిన్నకారు పోయి పెద్దకారు రావాలని, లక్ష వస్తుంటే కోటి కావాలని, కోటి వస్తే ఇంకా ఎక్కువ కోట్లు రావాలని ఇలా ఆశకు, కోరికలకు హద్దు లేకుండా ఉంటుంది. కానీ కేవలం అన్నం ఒక్కటే కడుపు నిండితే ఇంక చాలు అనేది. మహాఅయితే నిలవ ఉండేవి ఏవో కొన్ని పచ్చడిలాంటివి మరుసటి రోజుకు, నిలవ ఉండే పిండివంటలు లాంటివి అయితే   వారం పది రోజులకు తప్ప ఎక్కువ రోజులు పదార్ధం నిలవ ఉంచలేరు పాడైపోతాయి కాబట్టి. అందుకనే ఇక చాలు అనేది ఆహారము ఒక్కటే. కడుపు నిండితే ఇకచాలు అనటం తప్ప వేరే దారిలేదు. ప్రాణాలను నిలబెట్టీది అన్నము అంతేకాక ఇకచాలు అనేది అన్నమునకు ఒక్కదానికే, కాబట్టి అన్ని దానములలోకెల్లా ది గొప్పది. 
 
పూర్వకాలములో ఆహారము వండేటప్పుడు కొన్ని సాంప్రదాయాలను పాటించేవారు. భోజనము చెయ్యడానికి ఒక పద్ధతి ఉండేది. కాలక్రమేణ ఆధునిక సమాజములో నిరూపించలేని ఏ కర్మకాండ అయినా నేటితరం వారు ఆమోదించడం లేదు. ఏది ఎందుకు చెయ్యాలి, ఏది చేస్తే ఏమి వస్తుందో చెప్పేవారు కూడా తగ్గిపోయారు. ఒకవేళ ఇంట్లో పెద్దవాళ్ళు ఇది చెయ్యాలి, ఇలా చెయ్యాలి అని చెప్పినా, దానిని వాళ్ళు సైంటిఫిక్ గా చెప్పలేకపోవడంచేత చాలావిద్యలు, సాంప్రదాయాలు కాలగర్భములో మాయమైపోతున్నాయి.  

పూర్వకాలములో ఇంటిలోని వారందరు ఒకేసారి ఒక బంక్తిగా భోజనం చేసేవారు. అందరి మానసికస్థితి ఆ సమయములో ఒకేలాగా ఉండేది. భోజనానికి ముందు దైవప్రార్ధన చేసేవారు. ఉన్నది కలిసి ఉన్నది పంచుకొని తినేవారు. ఒక్కొక్కరికి అనేకమంది సంతానం ఉన్నా ఆహారానికి మాత్రం ఏలోటు ఉండేది కాదు.

కాలప్రవాహములో ఈ బంక్తి భోజనాలలో ఆహారాన్ని వదిలేయడం (food wastage) మొదలైనది. అందుచేత ప్రకృతి ఈ బఫే సిస్టమ్ (Buffet system) తీసుకువచ్చింది ఎవరికి ఏది కావాలో, ఎంత కావాలో అంతే తీసుకొని, తినమని. కానీ చాలామంది మనుష్యులలో no realization. ప్లేట్ లో పెట్టుకోవడం రుచి బాలేదనో, నూనెఅనో, తియ్యగాఉంది అనో, చల్లగా ఉందిఅనో, ఫ్రెష్ కాదుఅనో  ఏదో ఒకకారణము చేత ఆహారమును వృధా (waste) చెయ్యడం అలవాటు అయిపోయింది. సుఖంగా తినే భోజనం నిలబడి చేయవలసి వచ్చింది. అన్ని పదార్ధాలు ఉన్నా తినడానికి అక్కడ మొహమాటం. మనకు తెలియకుండానే చేసే ఈ తప్పు వలన ఆకలివేసినప్పుడు ఆహారము దొరకకపోవడం జరుగుతోంది. కంచంలో అన్నం వడ్డిస్తారు కానీ వెంటనే రారు తినరు. చిన్నప్పుడు అమ్మ వడ్డించి తిను తిను అని బ్రతిమలాడినా తినడానికి ఇష్టపడరు, పైగా వంకలు పెడుతూ తింటూ ఉంటారు. ఫలితముగా చదువు కోసమో, ఉద్యోగరీత్యానో, ఎక్కడో ఉన్నప్పుడు ఆ కర్మ తిరిగి అనుభవించవలసి వస్తుంది. ఏది తినడానికి ఇష్టపడమో అదే తినాల్సి వస్తుంది. Mostly అక్కడ choice కూడా ఉండదు. మెస్ లోనో, హోటల్ లోనో వాడు భోజనంలో ఏది పెడితే అదే తినాలి ఇంకా టిఫెన్స్ లో కొంత choice ఉంటుంది. అదీ use చేసుకోము. ఏమి తింటారు అని అడిగితే ఎదుటివాళ్ళని నీ ఇష్టం అంటారు. ఎదుటివారికి ఇష్టమైనది మనం ఎందుకు తినడం, మన ఇష్టమైనదే మనం తినవచ్చు కదా. ఆలాకూడా choice లేకుండా చేసుకుంటుంటారు. ఇంట్లోనే అన్నీ తింటే బయటకూడా అన్నీ తినవచ్చు కదా. ఇంట్లో అన్నీ తినకపోవడం వలన బయటకు వెళ్ళినప్పుడు సామాన్యముగా మనం ఇష్టపడనిదే ఎక్కువగా దొరుకుతుంది.     

ఆహారము మనల్ని ఎలా wait చేయిస్తుంది అన్నదానికి మరొక ఉదాహరణ functions. అక్కడ కూడా మనకు choice ఉండదు వాళ్ళు పెట్టినప్పుడు, పెట్టినది తినవలసిందే. దానికి కూడా క్యూ. మళ్ళీ ఎవరికోసమో వెయిటింగ్. ఎందుకు ఇవి అన్నీ అంటే అన్నాన్ని నువ్వు వెయిట్ చేయించావు సో ఇప్పుడు అన్నం నిన్ను వెయిట్ చేయిస్తోంది. As you sow so you reap కానీ ఇది అర్ధం కాక మనం మనుష్యులను, పరిస్థితులను తిట్టుకుంటూ ఉంటాం. వాళ్ళ ఇంటిలో లేట్ అన్నం త్వరగా పెట్టారు అనో, రుచిగా ఉండదు అనో, శుభ్రంగా ఉండదు అనో వెయ్యి కారణాలు. కానీ మన పరిస్థితులకు మనమే కారణం.